April - 2012



26 ఏప్రిల్- 02 మే 2012
 
పీఎస్‌ఎల్‌వీ-సీ19 విజయవంతం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ )-సి19ను ఏప్రిల్ 26న శ్రీహరికోట నుంచి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం(రీశాట్)-1ను 480కి.మీ. ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్య లో పీఎస్‌ఎల్‌వి-సీ19 ప్రవేశపెట్టింది. దీంతో రాడార్ ఇమేజింగ్ పరిజ్ఞానం ఉన్న అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల జాబితాలో భారత్ చేరింది. పూర్తి స్వ దేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్-1 బరువు 1858 కిలోలు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించిన బరువైన ఉపగ్రహం ఇదే. మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ తరహాకు చెందిన ఉపగ్రహం ద్వారా రాత్రి, పగలు మేఘావృత వాతావరణంలో కూడా భూఉపరితల చిత్రాలు దీని ద్వారా పొందొచ్చు. ఈ చిత్రాలు విపత్తుల నిర్వహణ, వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇలాంటి సమాచారం భారత్‌కు ఇప్ప టి వరకు కెనడా ఉపగ్రహం అందజేస్తోంది.
 
రాజ్యసభకు సచిన్, రేఖ
క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, నాటి హిందీ సినీనటి రేఖతో పాటు పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త అనూ అగాలను రాష్ర్టపతి ఏప్రిల్ 26న రాజ్యసభకు నామినేట్ చేసారు. 39 ఏళ్ల సచిన్ 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నటి రేఖ(57) 1980ల్లో బాలీవుడ్ అగ్రశ్రేణి నటిగా కొనసాగారు. అనూ అగా(70) థెర్మాస్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. సోనియాగాంధీ నాయకత్వంలోని జాతీయ సలహామండలిలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 80వ ప్రకరణ ప్రకారం సైన్‌‌స, సాహిత్యం, కళలు, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు చేసిన 12 మందిని రాజ్యసభకు రాష్ర్టపతి నామినేట్ చేస్తారు. ఎగువసభైన రాజ్యసభలో సభ్యుల సంఖ్య 250.
 
భారత క్రెడిట్ రేటింగ్ తగ్గించిన ఎస్ అండ్ పీ
భారతప్రభుత్వ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్‌‌డ అండ్ పూర్‌‌స (ఎస్ అండ్ పీ) ఏప్రిల్ 25న ప్రకటించింది. ప్రస్తుతమున్న స్థిరస్థాయి BBB+ నుంచి BBB+ ప్రతికూల స్థాయికి తగ్గించింది. వచ్చే రెండేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోతే, రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ సావరిన్ రేటింగ్‌ను కూడా తగ్గించే అవకాశముందని ఎస్ అండ్ పీ తెలిపింది. BBB- స్థాయి పెట్టుబడులకు అత్యంత ప్రతికూలమైంది. క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో కార్పొరేట్ సంస్థలు విదేశీ రుణాల సమీకరణపై క్యాపిటల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు, కంపెనీలు వాటి రుణాల తిరిగి చెల్లింపుపై రేటింగ్ ఏజెన్సీలు తమ అభిప్రాయాన్ని రేటింగ్ రూపంలో తెలుపుతాయి. ఈ రేటింగ్‌‌స అత్యధిక సురక్షిత స్థాయి AAA నుంచి అట్టడుగు స్థాయి D వరకు ఉంటాయి.
 
మలేరియా వ్యాధికి స్వదేశీ మందు
మలేరియా వ్యాధికి దేశీయంగా తొలిసారి తయారుచేసిన మందు సిన్‌రియంను న్యూఢిల్లీలో ఏప్రిల్ 25న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ మార్కెట్‌కు విడుదల చేశారు. ఈ మందును ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ తయారుచేసింది. పెద్దలకు సోకిన ప్లాస్మోడియం పాల్సీఫరుం మలేరియా చికిత్సకు ఈ మందును వాడతారు. ఇది 95 శాతంపైగా వ్యాధిని నయం చేస్తుంది. మలేరియా వల్ల ప్రపంచం లో ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. ఆగ్నేయాసియాలో ఏటా మలేరియా సోకుతున్న 2.5 మిలియన్లలో 77 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు.
 
నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ తెగ్ యుద్ధనౌక
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తెగ్‌ను ఏప్రిల్ 27న రష్యాలో భారత నౌకాదళంలో చేర్చారు. తల్వార్ తరగతికి చెందిన యుద్ధనౌకల్లో ఇది అధునాతనమైంది. ఉపరితలం నుంచి ఉపరి తలానికి ప్రయోగించే క్షిపణి బ్రహ్మోస్‌తో పాటు ఇతర ఆధునిక ఆయుధాలు, ఇందులో అమర్చొచ్చు. ఈ నౌక జూన్ నాటికి భారత తీరం చేరుతుంది. సెప్టెంబరు 2012-13 నాటికి తెగ్ తరగతికి చెందిన తర్కాష్, త్రిఖండ్ నౌకలు కూడా భారత్ చేరనున్నాయి.
 
అణు ఇంధన కమిషన్ చైర్మన్‌గా రతన్ కుమార్ సిన్హా
బార్‌‌క(బాబా అణు పరిశోధన సంస్థ) డెరైక్టర్ రతన్ కుమార్ సిన్హా అణు ఇంధన కమిషన్ (ఏఈసీ) చైర్మన్‌గా శ్రీకుమార్ బెనర్జీ స్థానంలో ఏప్రిల్ 27న నియమితులయ్యారు. ఈయన అణు ఇంధన విభాగం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు.

అటార్ని జనరల్‌గా వాహన్‌వతి నియామకం
అటార్నీ జనరల్‌గా గులామ్-ఇ-వాహన్‌వతి (63)ని రాష్ర్టపతి ఏప్రిల్ 30న తిరిగి నియ మించారు. జూన్ 8 నుంచి మరో రెండేళ్లు ఈ పదవిలో ఉంటారు. తొలిసారి 2009లో మూడే ళ్ల కాలానికి ఆయన నియమితులయ్యారు.
రాష్ట్రీయం
రాష్ర్టంలో 72కు తగ్గిన పులుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 72కు తగ్గిందని అటవీశాఖ అధికారి హితుష్ మల్హోత్రా ఏప్రిల్ 26న తెలిపారు. పదేళ్ల క్రితం వీటి సంఖ్య 105 గా ఉండేది. దేశవ్యాప్తంగా కూడా పులుల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు హక్కులు కల్పించడంతో అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయని అన్నారు.
 
శాంతా సిన్హాకు యుధ్‌వీర్ అవార్డు
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్‌పర్సన్ శాంతా సిన్హాకు యుధ్‌వీర్-2012 అవార్డు లభించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘మిలాప్’ హిందీ దినపత్రిక వ్యవస్థాపకుడు యుధ్‌వీర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు.
 
19- 25 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
జాతీయం
ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద సౌర శక్తి విద్యుత్ కేంద్రాన్ని గుజరాత్‌లోని పఠాన్ జిల్లా చరంకా వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న ప్రారంభించారు. 600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ఈ కేంద్రాన్ని 3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారు. చరంకా వద్ద 214 మెగావాట్లు.. ఆనంద్, జామ్‌నగర్, కచ్, పోర్‌బందర్ తదితర కేంద్రాల్లో మిగిలిన 386 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దేశంలో సౌర విద్యుత్ రంగంలో గుజరాత్‌కు 66 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దేశంలో 900 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆసియాలో అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. నాలుగు దశల్లో 2,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేపడుతున్న ఈ కేంద్రం 2019 నాటికి పూర్తికానుంది.
రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఏప్రిల్ 17న విడుదల చేసిన ద్రవ్యపరపతి విధాన ప్రకటనలో రెపో రేటును అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. స్వల్ప కాలానికి బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును (రెపో రేటు) గత మూడేళ్లలో ఆర్‌బీఐ తొలిసారి తగ్గించింది. దీంతో గృహ, వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. రివర్స్ రెపో రేటు(బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు)ను 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) 4.75 శాతంగానే ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13) ఆర్థికాభివృద్ధి (జీడీపీ వృద్ధిరేటు) 7.3 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.
ఈసీని సమర్థించిన సుప్రీం కోర్టు
రాజకీయ పార్టీలకు గుర్తింపు మంజూరుపై ఎన్నికల కమిషన్(ఈసీ) అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈసీ అనుసరిస్తున్న విధానంలోని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పలు రాష్ట్రాల్లోని గుర్తింపు పొందని ప్రాంతీయ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు పొందడంతోపాటు కనీసం రెండు అసెంబ్లీ సీట్లు సాధించిన రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు మంజూరు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీతోపాటు బహుజన్ వికాస్ అఘడి, దేశీయ ముర్పోక్కు ద్రవిడ ఖజగం తదితర పార్టీలు.. గతంలో తమకు కేటాయించిన గుర్తును ఈసీ మార్చడాన్ని సవాలు చేస్తూ 2008లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లన్నిటినీ పలుసార్లు విచారించిన సుప్రీం కోర్టు, ఈసీ అనుసరిస్తున్న విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 18న తీర్పు వెలువరించింది.
జాతీయ పంటల అంచనా కేంద్రం ప్రారంభం
దేశంలో పంటల దిగుబడులు, కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు ఉద్దేశించిన జాతీయ పంటల అంచనా కేంద్రాన్ని (ఎన్‌సీఎఫ్‌సీ) కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఏప్రిల్ 23న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రధాన పంటలైన వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న తదితర 11 పంటల దిగుబడులను ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా వేస్తుంది. ఇస్రోతో కలిసి జిల్లాల్లో సబ్ డివిజన్ స్థాయిల్లో కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తుంది.
అగ్ని-5 పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని ఏప్రిల్ 19న ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి నిర్వహించారు. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరిధిలోకి చైనాలోని తూర్పు ప్రాంతాలు వస్తాయి. తూర్పు ఐరోపా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాలను కూడా ఇది చేరగలదు. ఈ ప్రయోగంతో ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్)లు క లిగి ఉన్న దేశాల సరసన భారత్ నిలిచింది. ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ దేశాలు మాత్రమే ఈ సామర్థ్యం కలిగి ఉన్నాయి. అగ్ని-5 క్షిపణి పొడవు 55 అడుగులు, ఆరున్నర అడుగుల వ్యాసం. ధ్వని వేగం కంటే 24 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 1500 కిలోల బరువున్న పేలోడ్‌ను తీసుకెళ్తుంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఈ క్షిపణిని రూపొందించింది.

రాష్ట్రీయం
తుమ్మలపల్లె యురేనియం కేంద్రం ప్రారంభం
వైఎస్‌ఆర్ కడప జిల్లా తుమ్మలపల్లె ప్రాజెక్టులోని యురేనియం శుద్ధి కర్మాగారాన్ని అణు ఇంధన కమిషన్ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఇది దేశంలో రెండో యురేనియం కేంద్రం. మొదటి కేంద్రాన్ని జార్ఖండ్‌లోని జాదుగూడలో నెలకొల్పారు. తుమ్మలపల్లె ప్రపంచంలో ఎక్కువ యురేనియం ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతం. 2032 నాటికి 60,000 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి తుమ్మలపల్లె కేంద్రం తోడ్పడుతుంది. ప్రస్తుతం దేశంలో 5000 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూ. 48,935 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌కు 2012-13 సంవత్సరానికిగాను రూ.48,935 కోట్లతో కూడిన వార్షిక ప్రణాళికకు.. ప్రణాళికా సంఘం ఏప్రిల్18న ఆమోదం తెలిపింది. ఇది 2011-12 వార్షిక ప్రణాళిక (రూ.43,000 కోట్లు)కంటే 13.8 శాతం ఎక్కువ. ఈ సందర్భంగా తగ్గిన వృద్ధి రేటు, తదితర అంశాలను ప్రణాళికా సంఘం ప్రస్తావించింది. 2010 -11లో 8.92 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2011-12లో 5.81 శాతానికి పడిపోయింది. 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు 25.07 నుంచి 19.22 శాతం తగ్గడం పట్ల ప్రణాళికా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

చేనేత దిగ్గజం రాములు మృతి
చేనేత రంగంలో నూతన ఒరవడులు సృష్టించి.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన చేనేత దిగ్గజం గజం రాములు(68) గుండెపోటుతో ఏప్రిల్ 20న హైదరాబాద్‌లో మరణించారు. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన రాములు.. ‘తేలియా రుమాల్’ అనే వస్త్రం రూపొందించి ఖ్యాతి గడించారు. విశ్వకర్మ, ఉత్తమ జాతీయ కళాకారుడు, యునెస్కో పురస్కారం, భారత్ జ్యోతి వంటి పలు అవార్డులు ఆయనకు దక్కాయి.

12- 18 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్

భారత్‌లో పాక్ రాయబారి బషీర్

భారత్‌లో పాకిస్థాన్ నూతన రాయబారిగా సల్మాన్ బషీర్ నియమితులయ్యారు. 2008 నుంచి ఈ ఏడాది మార్చి వరకు బషీర్ పాక్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. షాహిద్ మాలిక్ స్థానంలో బషీర్ బాధ్యతలు చేపడతారు.
వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మతంతో సంబంధం లేకుండా వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 12న నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జనన మరణాల చట్టం-1969లో సవరణల కోసం ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్న మలి విడత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనుంది. తాజా సవరణ ద్వారా వైవాహిక వివాదాల్లో, పోషణకు సంబంధించిన అంశాల్లో మహిళలకు రక్షణ లభిస్తుంది. మతాంతర వివాహం చేసుకున్న జంటలకు గుర్తింపు, భార్యాభర్తల వయసు తదితర అంశాలపై కూడా దీని ద్వారా స్పష్టత వస్తుంది. బాల్య వివాహాలను అరిక ట్టటానికి వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది. సిక్కుల వివాహాలను హిందూ వివాహ చట్టం కింద కాకుండా ‘ఆనంద్ వివాహ చట్టం-1909’ కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను కేంద్రం ఆమోదించింది.
విద్యా హక్కు చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2009-విద్యా హక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, నాన్ మైనార్టీ అన్ ఎయిడెడ్ పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని పేర్కొంది. మైనార్టీ విద్యా సంస్థలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. విద్యా హక్కు చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ రాజస్థాన్‌కు చెందిన అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల సొసైటీతోపాటు పలు ప్రైవేట్ విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనల అనంతరం సుప్రీం కోర్టు ఏప్రిల్ 12న తీర్పు వెలువరించింది. దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలందరికీ ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా హక్కు చట్టం-2009ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం పాఠశాల విద్యను ఉచితంగా పొందే హక్కు బాలలం దరికీ సమానంగా ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ, ఎయిడెడ్, నాన్ మైనార్టీ అన్ ఎయిడెడ్ స్కూళ్లన్నింటిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలి. డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకూడదు. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
4జీ సేవలు ప్రారంభించిన ఎయిర్‌టెల్
దేశంలో తొలిసారిగా భారతీ ఎయిర్‌టెల్ 4జీ(ఫోర్త్ జనరేషన్)
టెలికాం సేవలను ఏప్రిల్ 10న కోల్‌కతాలో ప్రారంభించింది. 3జీ కంటే 4జీ ప్రసారాలు 10 రెట్లు వేగంగా ఉంటాయి. దీంతో ఇంటర్నెట్, వీడియో
ప్రసారాలు వేగంగా అందుతాయి.
త్రివిధ దళాధిపతులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు
రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం త్రివిధ దళాధిపతులు.. వీకే సింగ్(ఆర్మీ), ఎన్‌ఏకే బ్రౌన్ (ఎయిర్‌ఫోర్స్), నిర్మల్ వర్మ(నేవీ)లకు ఏప్రిల్ 10న సమన్లు జారీ చేసింది. త్రివిధ దళాలకు చెందిన బలగాల సన్నద్ధతపై వివరణ ఇచ్చేందుకు ఏప్రిల్ 20న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. రెండువైపులా యుద్ధం ముంచుకొస్తే ఇప్పటికిప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు లేవని ఇటీవలి జరిగిన సమావేశంలో రక్షణ శాఖ ఉన్నతాధికారులు పేర్కొనడంతో.. ఈ అంశంపై త్రివిధ దళాధిపతుల నుంచే నేరుగా వివరణ కోరాలని స్థాయీ సంఘం నిర్ణయించింది. సైనిక బలగాలకు రేషన్ సరఫరాలో అవకతవకలపై కాగ్ నివేదిక విడుదలైన నేపథ్యంలో గతేడాది జనవరిలో పార్లమెంటరీ ప్రజాల పద్దుల సంఘం త్రివిధ దళాధిపతుల వివరణ కోరింది. ఆ తర్వాత ఒక పార్లమెంటరీ సంఘం త్రివిధ దళాధిపతులను పిలిపిస్తుండటం ఇదే మొదటిసారి. పైగా బలగాల సన్నద్ధతపై వారి వివరణ కోరనుండటం స్వాతంత్య్రానంతర చరిత్రలో ఇదే తొలిసారి.
అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశం
దేశ అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సదస్సు ఏప్రిల్ 16న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ.. అంతర్గత భద్రత సమస్యలను ఎదుర్కోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సామర్థ్య నిర్మాణం, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ఏడు రాష్ట్రాలు మినహా అంతర్గత భద్రతపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నక్సలిజం, మత ఛాందస వాదం, వర్గ హింస దేశాన్ని పట్టి పీడిస్తున్న అంతర్గత సమస్యలని పేర్కొన్నారు. వీటిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం(ఎన్‌సీటీసీ) ఏర్పాటు, బీఎస్‌ఎఫ్, ఆర్‌పీఎఫ్ చట్టాల్లో సవరణ వంటి విషయాల్లో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో విమర్శించారు.

టైగర్ రిజర్వ్‌గా కవ్వాల్ సంరక్షణ కేంద్రం
ఆదిలాబాద్ జిల్లా, జన్నారం డివిజన్‌లోని కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ‘టైగర్ రిజర్వ్’గా రాష్ట్ర ప్రభు త్వం ఏప్రిల్10న నోటిఫై చేసింది. 892.33చదరపు కి.మీ. విస్తీర్ణం గల ఈ ప్రాంతం రాష్ట్రంలో రెండో పులుల సంరక్షణ కేంద్రం. దేశంలో 42వది. రాష్ట్రంలో ప్రస్తుతం శ్రీశైలంలో పులుల సంరక్షణ కేంద్రం ఉంది. కవ్వాల్‌లో 20 పులులు ఉన్నట్లు అనధికార లెక్కలు తెలుపుతున్నాయి.
భారత జల వారోత్సవాలు
భారత జల వారోత్సవాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ఏప్రిల్ 10న ప్రారంభించారు. దేశంలో తొలి సారిగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ నీటి వినియోగంపై నియంత్రణ ఉండాలన్నారు. భూగర్భ జలాలను ఉమ్మడి వనరుగా గుర్తించాలన్నారు. నీటి సక్రమ వినియోగాన్ని 20 శాతానికి పెంచాలని ‘జాతీయ నీటి విధానం(నేషనల్ వాటర్ మిషన్)’ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
దక్షిణ మధ్యరైల్వేకి గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే జోన్లకు సంయుక్తంగా గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు లభించింది. ఏటా దేశంలోని 17 రైల్వే జోన్ల పని తీరును రైల్వే శాఖ ఉన్నతాధికారులు సమీక్షించి అత్యుత్తమ పనితీరు చూపిన జోన్‌కు ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు. ఆరేళ్ల తర్వాత దక్షిణ మధ్యరైల్వేకి ఈ పురస్కారం దక్కింది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రవాణా, స్టోర్స్ వంటి ఆరు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఉత్తమ ప్రతిభ చూపింది.

5- 11 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
నౌకాదళానికి ఐఎన్‌ఎస్ చక్ర
అణు ఇంధన సామర్థ్యం గల జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ చక్ర’ను ఏప్రిల్ 4న లాంఛనంగా భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు. రష్యా నుంచి భారత్ లీజుకు తీసుకున్న అకులా శ్రేణికి చెందిన ఈ అణు జలాంతర్గామి పదేళ్ల పాటు నావికాదళంలో సేవలందిస్తుంది. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం స్థావరంగా ‘చక్ర’ పని చే స్తుంది. (దీన్ని రష్యా నావికాదళంలో నెర్పా-152గా వ్యవహరించేవారు). దీంతో అణు ఆధారిత ఇంధనంతో జలాంతర్గామిని నిర్వహించే ఆరో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా మాత్రమే ఇటువంటి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.
శత్రుదేశాల సెన్సార్‌లు చక్రను గుర్తించలేవు. 108 మీటర్ల పొడవు, 13.5 మీటర్ల వెడల్పు, 8,140 టన్నుల బరువు ఉన్న ఈ జలాంతర్గామి గంటకు 30-35 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 190 మెగావాట్ల అణు రియాక్టరు ఉంది. 500 కిలో మీటర్ల లోతులో పని చేయగలదు. ఈ ఏడాది జనవరి 23న రష్యా నావికాదళం దీన్ని భారత్‌కు అప్పగించింది. 2009లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామి ప్రయోగ పరీక్షల దశలోనే ఉండటంతో భారత నావికాదళానికి ప్రస్తుతానికి సేవలందించడం లేదు.

అవాక్స్ పరీక్ష విజయవంతం
గగనతల నిఘా హెచ్చరిక వ్యవస్థ‘ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్(అవాక్స్)’ వ్యవస్థకు తొలిసారిగా బ్రెజిల్‌లో నిర్వహించిన పరీక్ష విజయవంతమైందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) ఏప్రిల్ 5న ప్రకటించింది. దేశీయంగా రూపొందించిన రెండో అవాక్స్ వ్యవస్థ తొలి పరీక్ష విజయవంతం కావడంతో జూన్‌లో భారత వైమానిక దళానికి దీన్ని అప్పగించే అవకాశాలున్నాయి. దీన్ని ‘ఆకాశ నేత్రం’గా కూడా వ్యవరిస్తారు. ఇది శత్రువు దేశాల విమానాలను, మానవరహిత విమానాలను గుర్తించగలదు.

ప్రపంచంలో తొలి మహిళా పారామిలటరీ బ్యాండ్
ప్రపంచంలోనే మొట్టమెదటి సారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన పారామిలటరీ పైప్ బ్యాండ్(సంగీత బందం) ను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్‌పీఎఫ్) ఏర్పాటు చేసుకుంది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 9న నిర్వహించిన పరాక్రమ దినోత్సవం సందర్భంగా మహిళల బ్యాండ్ తన తొలి ప్రదర్శన ఇచ్చింది. 1986లో సీఆర్‌పీఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటైంది.

పాక్ అధ్యక్షుడు జర్దారీ భారత పర్యటన
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏప్రిల్ 8న భారత్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కాశ్మీర్ సహా సర్‌క్రీక్, సియాచిన్ సమస్యల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా వచ్చింది. ముంబై దాడులకు కారణమైన హాఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్ భూభాగంపై భారత్ వ్యతిరేక చర్యలను అరికట్టాలని ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్, జర్దారీని కోరారు. పాక్ పర్యటనకు రావాలన్న జర్దారీ ఆహ్వానానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకారం తెలిపారు. జర్దారీ రాజస్థాన్‌లోని అజ్మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ ఛీస్తి దర్గాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దర్గాకు పది లక్షల డాలర్ల(రూ.5.11 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు.

మలబార్-2012
భారత్-అమెరికా నౌకా దళాల 16వ ఉమ్మడి శిక్షణ కార్యక్రమం చెన్నై, అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని భారత సముద్ర తీరంలో ఏప్రిల్ 7న ప్రారంభమైంది. దీనికి ‘మలబార్-2012’ అనే పేరు పెట్టారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భారత నౌకా దళం తరపున ఐఎన్‌ఎస్ రణ విజయ్, ఐఎన్‌ఎస్ కులీష్, ఐఎన్‌ఎస్ శక్తి యుద్ధ నౌకలు , అమెరికా తరపున యుఎన్‌ఎస్ కారల్ విల్సన్(సివిఎన్-70), ఎస్‌ఎన్‌హర్లీ, ఎన్‌ఎస్ ఫంకర్ హిల్ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. భారత-అమెరికా దళాలు 1992 నుంచి ఉమ్మడి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

ఖతార్ రాజు భారత పర్యటన
ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ భారత్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. థానీ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. కీలకమైన చమురు, గ్యాస్ అన్వేషణ పంపిణీ కార్యకలాపాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం, మరో ఐదు అంశాలపై ఇరు దేశాలు ఏప్రిల్ 9న అవగాహనకు వచ్చాయి. రష్యా, ఇరాన్‌ల తర్వాత సహజ వాయువు నిల్వలు అధికంగా ఉన్న మూడో ప్రాంతం ఖతార్. భారత్‌కు ద్రవీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ) అతి పెద్ద సరఫరాదారు ఖతార్. ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఖతార్ నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది.

29 మార్చి- 4 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద గల ఐటీఆర్ (ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్) నుంచి మార్చి 28న నిర్వహించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దీన్ని ‘స్టీప్ డ్రైవ్’ అనే నూతన పద్ధతిలో పరీక్షించారు. ఈ ప్రయోగంలో బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగం కంటే రెండున్న రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లింది. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది 29వ సారి. 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ 300 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు.

న్యాయ వ్యవస్థ జవాబుదారీ బిల్లుకు ఆమోదం
న్యాయ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు 2010కి లోక్‌సభ మార్చి 29న ఆమోదం తెలిపింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు వీలుగా ఓ వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే జడ్జీల విచారణ చట్టం-1968 రద్దు అవుతుంది. అదే సమయంలో పాత చట్టంలోని పార్లమెంట్‌కు సుప్రీం, హైకోర్టు జడ్జీల అభిశంసన అధికారం వంటి కీలక అంశాలు కొనసాగుతాయి. అంతేకాకుండా.. సుప్రీం, హైకోర్టు జడ్జీలు వారి ఆస్తులను వెల్లడించాలి. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే కమిటీ కార్యకలాపాలను వీడియో తీయాలన్న స్థాయి సంఘం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

2010లో 5.56 లక్షల క్యాన్సర్ మరణాలు
భారత్‌లో 2010లో 5.56 లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారని ‘ది లాన్సెట్’ అనే అంతర్జాతీయ పత్రిక మార్చి 28 సంచికలో తెలిపింది. వీరిలో 71 శాతం మంది 30-69 సంవత్సరాల మధ్య వయసు వారు. పురుషుల్లో ఎక్కువ మంది నోటి క్యాన్సర్ వల్ల.. మిహ ళల్లో ఎక్కువ మంది సర్వికల్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. సర్వికల్ క్యాన్సర్‌తో దేశంలో ప్రతి ఏటా 33,000 మంది మృత్యువాత పడుతున్నారు.

ఆరు ఒప్పందాలపై భారత్-బ్రెజిల్ సంతకాలు
బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి మార్చి 30న ఒప్పందాలు కుదిరాయి. ఇందులో శాస్త్రసాంకేతిక రంగం, బయోటెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, భారత్‌లో బ్రెజిల్ విద్యార్థులకు, పరిశోధకులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలు ఉన్నాయి. రక్షణ, అణు ఇంధనం, మరికొన్ని ప్రధాన రంగాల్లో పూర్తిగా సహకరించుకోవాలని, గ్లోబల్ గవర్నెన్స్ విధానంలో ముఖ్యంగా జి-20 ప్రక్రియకు సంబంధించి చర్చలు విస్తరించుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇరు దేశాలు అంగీకరించాయి.

మిస్ ఇండియా వరల్డ్ వన్య మిశ్రా
మిస్ ఇండియా-2012గా చండీగఢ్‌కు చెందిన వన్య మిశ్రా ఎంపికయ్యారు. మార్చి 30న ముంబైలో జరిగిన పోటీలో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను ప్రాచీ మిశ్రా గెలుచుకోగా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌గా రోఛెల్లీ మరియా రావు నిలిచింది. వీరు 2012 మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషన్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తారు.

భారత్‌లో అమెరికా రాయబారిగా పావెల్
భారత్‌లో అమెరికా రాయబారిగా నాన్సీ పావెల్ నియామకాన్ని అమెరికా చట్ట సభ సెనెట్ మార్చి 30న ఖరారు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో తిమోతీ రోమర్ రాజీనామాతో ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో ఆ పదవిలో డిసెంబర్ 16న నాన్సీ పావెల్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.

Total Pageviews

Template Information

Template Information